వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనపడుట లేదు

13 May, 2021 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మొదటి వేవ్‌ను అంచనా వేసిన కేం‍ద్రం రెండో వేవ్‌లో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే దేశంలో సెకండ్‌ వేవ్‌ రూపాన కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సగానికి పైగా వారి ప్రజలకు అందించి ఈ మహమ్మారి బారి కాస్త ఉపశమనం పొందాయి. అయితే మన భారత్‌లో మాత్రం పరిస్థితి మరోలా ఉందనే చెప్పాలి. ఇక్కడ కరోనా బాధితులకు బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వ్యాక్సిన్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాలకు కేంద్రం చేసిన పొరపాట్లే కారణమని ఎత్తి చూపుతూ కేంద్రం ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.

ఇటీవల పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణం, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరతపై రోజుకో ట్వీట్‌తో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న రాహుల్‌.. తాజాగా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రధాని కనీసం ఈ మహమ్మారిపై స్పందించడం లేదంటూ పరోక్షంగా దుయ్యబట్టారు. ‘‘వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌, ఔషధాలతో పాటు ప్రధానమంత్రి కూడా కన్పించట్లేదు. కేవలం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు, మందులపై జీఎస్టీ, అక్కడా.. ఇక్కడా అంటూ ప్రధాని ఫొటోలు మాత్రమే దర్శనమిస్తున్నాయి’’ అని మోదీ పై వ్యంగ్యంగా రాహుల్‌ ట్వీట్ చేశారు. 
దేశంలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ నేతలు మండిపడుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉచితంగా చేపట్టాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలు నిన్న ప్రధానికి లేఖ రాశారు. సెంట్రల్‌ విస్టా నిర్మాణాన్ని తక్షణమే ఆపివేసి ఆ నిధులను ఆక్సిజన్‌ సేకరణ, ఇతర కొవిడ్‌ నియంత్రణ చర్యలకు ఉపయోగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

( చదవండి: కరోనా: ప్రధాని నరేంద్రమోదీపై ప్రియాంక ఫైర్‌ )

మరిన్ని వార్తలు