మీ తీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది: మోదీ

7 Dec, 2021 15:43 IST|Sakshi

బీజేపీ ఎంపీలు, మినిస్టర్లు సమావేశాలు, మీటింగ్‌లకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశం

తీరు మార్చుకోకపోతే.. మార్చాల్సి ఉంటుందని హుకుం

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎన్‌డీఏకి చెమటలు పట్టిస్తున్నాయి. పలు అంశాలపై విపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేసి.. గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఇలాంటి సందర్భంలో పలువురు బీజేపీ ఎంపీలు, మినిస్టర్లు.. సమావేశాలకు హాజరు కాకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చాలామంది బీజేపీ ఎంపీలు మీటింగ్‌లకు, పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావడం లేదని.. ఇది ఇలానే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని మోదీ హెచ్చరించినట్లు సమాచారం.
(చదవండి: Amit Shah: పొరపాటు వల్లే కాల్పులు)

ఎంపీలు, మినిస్టర్లు ప్రవర్తన మార్చుకోకపోతే.. మార్చాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని మోదీ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. బీజేపీ  ఎంపీలు, మినిస్టర్‌లు క్రమశిక్షణతో మెలగాలని పదే పదే సూచించే మోదీ.. ఈ సారి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారట. క్రమశిక్షణతో మెలగాలని.. సమయపాలన పాటించాలని.. చిన్న పిల్లల మాదిరి కుంటి సాకులు చెప్పవద్దని సూచించారట. 

ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించని బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్‌ సమావేశాలకు, మీటింగ్‌లకు అందరూ క్రమం తప్పకుండా హాజరుకావాల్సిందే. పిల్లలకు చెప్పినట్లు.. పదే పదే దీని గురించి మీతో చర్చించడం నాకు బాగా అనిపించడం లేదు. మీరు మారకపోతే.. మార్పులు చేయాల్సి వస్తుంది’’ అని మోదీ హెచ్చరించారు. ఈ సమావేశానికి సీనియర్‌ మంత్రులు అమిత్‌ షా, పీయుష్‌ గోయల్‌, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, పార్లమెంటు వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు హాజరయ్యారు. 
(చదవండి: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!)

పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు పలు అంశాలపై మోదీ ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగాలాండ్‌లో పౌరులపై సైనిక కాల్పుల పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి సమయంలో మద్దతుగా.. ఏకతాటిపై నడవాల్సిన ఎంపీలు సమావేశాలకు డుమ్మా కొట్టడంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం

మరిన్ని వార్తలు