Ambati Rambabu: చంద్రబాబు ఏం చేశాడో తెలుసా?.. మ్యాప్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వాస్తవాలు చెప్పిన మంత్రి అంబటి

25 Jul, 2022 15:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్‌ గురించి మ్యాప్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వాస్తవాలను వివరించారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు నిర్ణయాలే కారణమన్నారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు.
చదవండి: వరద బాధితుల సహాయార్థం ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం 

‘‘నామినేషన్‌ పద్దతిలో కాంట్రాక్టర్లను తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత పాటించాం. పనుల్లో నాణ్యత పెంచేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. ట్రాన్స్‌ట్రాయ్‌ను తీసేసి నవయుగ తెచ్చింది చంద్రబాబు కాదా?. కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయా ఫ్రమ్‌ వాల్‌ ఎలా కట్టారు?. డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారు. కాసుల కోసం కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిదం చేశారు. నాటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మాపై విష ప్రచారం చేస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ముంపు ప్రజలకు ప్యాకేజ్‌ అందించి ఖాళీ చేయిస్తున్నాం. ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.1500 కోట్లు ఖర్చు చేశామని’’ అంబటి అన్నారు.

‘‘పోలవరంపై టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర చేస్తోంది. పోలవరం విధ్వంసం అంటూ విష ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వలనే పోలవరం ఆగినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ట్రాన్స్ ట్రాయ్ ని తొలగించి నవయుగ అనే సంస్థకు అప్పగించారు. మేము రివర్స్ టెండర్ నిర్వహించి ప్రభుత్వానికి 12.6 శాతం ఆదా చేశాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి దుర్మార్గమైన వార్తలు రాస్తున్నాయి. కాపర్ డ్యాం కట్టాక డయా ఫ్రంవాల్ కట్టాలి. కానీ చంద్రబాబు ఏం చేశాడో అందరూ తెలుసుకోవాలి. ఆయనగారి ముందు చూపులేని ఫలితంగా ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాపర్ డ్యాం నిర్మాణం చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయటం వలనే ఇబ్బందులు. చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చటానికి ఎల్లోమీడియా తాపత్రయ పడుతోంది. వాస్తవాలు రాసే దమ్ము ఆ మీడియాకు ఉందా?’’ అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు