ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్లాల్సిందే: పొంగులేటి

17 Jan, 2021 18:31 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిమానమే తనకు చాలా పెద్ద పదవి అని, పదవి రావాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగదని అన్నారు. పదవి పోయేటప్పుడు కాంక్రీట్‌ గోడలు కట్టినా లాభం ఉండదని వ్యాఖ్యానించారు. పదవులు ఎవరి సొత్తూ కాదని పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తారని చెప్పుకొచ్చారు. వేంసూర్‌లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. టీఆర్‌ఎస్‌లో ఉన్నాం.. రేపు కూడా ఇదే పార్టీలో ఉంటాం.

కానీ ఈ రకమైన కక్షపూరిత రాజకీయాలు మంచిదికాదు. నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తెలియని అసమర్థుడిని కాను. నా వారిని ఇబ్బంది పెట్టినవారు ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. చక్రవడ్డీతో సహా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. అధికారం ఉందికదా అని ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదు. నేను ప్రజాప్రతినిధిని కాను, ఎవరి పర్మిషనూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్లాల్సిందే. నా వర్గం ప్రజాప్రతినిధులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’అని పొంగులేటి పేర్కొన్నారు.
(చదవండి: పట్టభద్రుల కోటా.. పకడ్బందీగా పావులు)

మరిన్ని వార్తలు