ప్రధాని మోదీకి సొంత తమ్ముడు షాక్‌

31 Jul, 2021 20:25 IST|Sakshi
వ్యాపారుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రహ్లాద్‌మోదీ (ఫొటో: TheTimesOfIndia)

ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ షాకిచ్చారు. మోదీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) చెల్లించవద్దని ప్రహ్లాద్‌ మోదీ వ్యాపారస్తులకు సూచించారు. ‘మోదీ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. వారు మీ సమస్యలు వినాలి’ అని వ్యాపారస్తులకు చెప్పారు. ‘మనమేమీ బానిసలం కాదు’ అని తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాపారులకు ‘జీఎస్టీ చెల్లించబోం’ అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా లేఖ రాయాలని తెలిపారు.

మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం వ్యాపారుల సదస్సు జరిగింది. ఉల్హాస్‌నగర్‌ వ్యాపారుల సంఘం పిలుపు మేరకు హాజరైన ప్రహ్లాద్‌ మోదీ మాట్లాడుతూ.. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనమేమీ బానిసలం కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్హాస్‌నగర్‌ వ్యాపార కేంద్రంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రహ్లాద్‌ మోదీ విమర్శించారు. ‘గుజరాత్‌లోనైతే వ్యాపారానికి రసాయనాల వినియోగం అనుమతి ఉందని, రసాయన వ్యర్థాల నిర్వహణకు కూడా సరైన ప్రణాళిక ఉంది. గుజరాత్‌ అనుమతి ఇస్తున్నప్పుడు మహారాష్ట్ర ఎందుకు ఇవ్వదు’ అని నిలదీశారు.

మరిన్ని వార్తలు