‘ప్రజాసంగ్రామ యాత్ర’ ఒక ఆయుధం 

21 Aug, 2021 01:52 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ కుటుంబ, అవినీతి పాలనపై అన్నివర్గాలు విసిగివేసారి ఉన్నందున టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దించేందుకు ‘ప్రజాసంగ్రామ యాత్ర’ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఈ యాత్ర సంజయ్‌ ఒక్కడిదే కాదని, యావత్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యంత్రాంగానిదని అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లాల అధికార ప్రతినిధులు, సోషల్‌ మీడియా ప్రతినిధులు, మీడియా బాధ్యులు, జిల్లా యాత్రా ప్రముఖ్‌లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జీలతో శుక్రవారంరాత్రి పొద్దుపోయే వరకు వేర్వేరుగా నిర్వహించిన వర్క్‌షాపులు, సమావేశాల్లో సంజయ్‌ మాట్లాడారు.

పాదయాత్ర ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రం నలుమూలాల ప్రజలకు చేరవేసేందుకు సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలను సమర్థవంతంగా ఉపయోగించుకోలన్నారు. ఇన్నాళ్లూ కార్యకర్తలు లాఠీచార్జీ, జైలుశిక్షలు వంటి కష్టాలను అనుభవించారని, ఇకనుంచి అధికారం చేజిక్కించుకునేందుకు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, సీనియర్‌ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్, సీనియర్‌ జర్నలిస్ట్‌ సాయి, పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి.మనోహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు