థర్డ్ ఫ్రంట్‌పై ప్రశాంత్ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు

30 Apr, 2022 20:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిలీ​: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ థర్డ్ ఫ్రంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ బీజేపీని ఓడించలేవని అన్నారు. కమలదళాన్ని గద్దెదించాలనుకునే ఏ పార్టీ అయినా..  రెండో ఫ్రంట్‌గా అవతరించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీని ఫస్ట్‌ ఫ్రంట్‌ అనుకుంటే.. వారిని ఎదుర్కొనేందుకు రెండో ఫ్రంట్‌ కావాల్సిందేనని స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ మూడో ఫ్రంట్‌గా రూపుదిద్దుకునేందుకు సహకరిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఈ మేరకు పీకే జవాబిచ్చారు. 

మరి కాంగ్రెస్‌ను రెండో ఫ్రంట్‌గా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. లేదని బదులిచ్చారు. కాంగ్రెస్ దేశంలో రెండో అతిపెద్ద పార్టీ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఆజ్‌తక్‌  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు తన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఆ పార్టీ పెద్దలతో కలిసి సమాలోచనలు చేశామని అన్నారు. ఆ పార్టీలో ఎందరో తలపండిన నేతలున్నారని.. సంస్కరణలు వారే సొంతంగా చేపట్టాలని పీకే పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌లోని పార్టీ అధిష్టానం తనను ఆహ్వానించినప్పటికీ తిరస్కరించానని చెప్పారు. పార్టీ మేలు ఏమేం చేస్తే బాగుంటుందో.. ముందుగా అనుకున్న బ్లూ ప్రింట్‌ కార్యరూపం దాల్చాలని ఆయన ఆకాక్షించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడం కరెక్ట్‌ కాదని పీకే వ్యాఖ్యానించారు. అయితే, పార్టీ బలోపేతానికి భారీ మార్పులు మాత్రం అవసరమని ఆయన నొక్కి వక్కాణించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనేది ఎవరో తెలియదని, రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలతో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమని చెప్పారు.

మరిన్ని వార్తలు