గాంధీ ఆశ్రమం నుంచి ప్రశాంత్‌ కిషోర్‌ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర

1 Oct, 2022 21:24 IST|Sakshi

పాట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. ‘జన్‌ సురాజ్‌’ ప్రచారంలో భాగంగా మహాత్మాగాంధీ జయంతి రోజున తూర్పు చంపారన్‌ జిల్లా నుంచి ఆదివారం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బిహార్‌లో సాగనున్న ఈ పాదయాత్ర.. దేశంలోని వివిధ ప్రాంతాలకూ విస్తరించనున్నారని, సుమారు 12-18 నెలల పాటు సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌కు ఈ యాత్ర సన్నాహంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

పాదయాత్రలో భాగంగా ప్రతి పంచాయతీ, బ్లాక్‌లను సందర్శించనున్నారు ప్రశాంత్‌ కిషోర్‌. ఎలాంటి బ్రేక్‌ లేకుండా యాత్రను కొనసాగించేలా ప్రణాళికలు రచించినట్లు పార్టీ తెలిపింది. తూర్పు చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం భిటిహర్వా నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు ప్రశాంత్‌ కిషోర్‌. అక్కడి నుంచే 1917లో మహాత్ముడు తొలి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ యాత్రను ముఖ్యంగా మూడు లక్ష్యాలతో చేపడుతున్నట్లు పార్టీ తెలిపింది. అందులో క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించటం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావటం, వివిధ రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం వంటివి ఉన్నాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ కార్యకర్తపై పోలీసుల దాడి.. ఆర్టికల్‌ 19 ప్రకారం స్వేచ్చ ఇదేనా అంటూ..

 

మరిన్ని వార్తలు