ఈశాన్యంలో కమల వికాసం 

3 Mar, 2023 03:20 IST|Sakshi

బీజేపీ ‘మిషన్‌ నార్త్‌ఈస్ట్‌’కు బూస్ట్‌  

త్రిపురలో సొంతంగానే స్పష్టమైన మెజార్టీ  

నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ–బీజేపీ కూటమికే మళ్లీ అధికారం  

మేఘాలయలో 2 సీట్లతో  కింగ్‌మేకర్‌గా కమలం పార్టీ  

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం  

అగర్తలా/షిల్లాంగ్‌/కోహిమా: ‘మిషన్‌ నార్త్‌ఈస్ట్‌’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కి నూతనోత్తేజం లభించింది. ఈశాన్య భారతంలో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ దక్కింది. 60 స్థానాలకు గాను సొంతంగా 32 స్థానాలు గెలుకొని, ఒక్కే ఒక్క స్థానంలో నెగ్గిన మిత్రపక్షం ఐపీఎఫ్‌టీతో కలిసి వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ)–బీజేపీ కూటమి 37 స్థానాల్లో పాగా వేసింది. ఎన్‌డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. 60 స్థానాలున్న మేఘాలయాలో ఒంటరిగా పోటీకి దిగి, కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీ కింగ్‌మేకర్‌గా అవతరిస్తుండడం గమనార్హం.

26 సీట్లలో నెగ్గిన అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వంలో బీజేపీ మళ్లీ జూనియర్‌ భాగస్వామిగా చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. నాగాలాండ్‌లో 5, త్రిపురలో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మేఘాలయాలో సున్నా చుట్టేసింది. త్రిపురలో కొత్త పార్టీ తిప్రా మోథా ఏకంగా 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది.  


త్రివేణికే ఈ మొత్త్తం క్రెడిట్‌: మోదీ
ఎన్నికల్లో బీజేపీ స్థిరంగా విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ పనితీరు పట్ల కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ గెలుపునకు గాను క్రెడిట్‌ మొత్తం ‘త్రివేణి’కే ఇవ్వాలన్నారు.

బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ఆయా ప్రభుత్వాల పని సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకితభావం వల్లే విజయాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం ఢిల్లీకి, దిల్‌(హృదయం)కి ఎక్కువ దూరంలో లేదన్న సంగతి ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి మళ్లీ అధికారం దక్కించుకోవడం పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణమని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మర్‌ జా మోదీ(చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ప్రజలు మాత్రం మత్‌ జా మోదీ(వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు.    

ఫలితాలు నిరుత్సాహకరం:కాంగ్రెస్‌ 
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు నిరుత్సాహం కలిగించాయని కాంగ్రెస్‌ పేర్కొంది. అయితే, ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లలో సాధించిన విజయం ప్రోత్సాహం నింపిందని తెలిపింది. ఈ ఫలితాలపై సమీక్ష జరిపి, పార్టీ సంస్థాగత బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. 

త్రిపురలో కాషాయం రెపరెపలు 
త్రిపురలో బీజేపీ–స్థానిక పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) కూటమి రెండోసారి అధికారం దక్కించుకుంది. మొత్తం 60 సీట్లకు గాను ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకుంది. ప్రద్యోత్‌ కిశోర్‌ దేవ్‌వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక వామపక్షాలు–కాంగ్రెస్‌ కూటమికి 14 స్థానాలు లభించాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. ఆ పార్టీ కి కేవలం 0.88 శాతం ఓట్లు లభించాయి. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడడం గమనార్హం.

బీజేపీ, ఐపీఎఫ్‌టీకి 2018తో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. తిప్రా మోథా పార్టీ గణనీయంగా పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈసారి 55 స్థానాల్లో పోటీకి దిగిన బీజేపీకి 32 స్థానాలు గెలుచుకుంది. ఐపీఎఫ్‌టీకి కేవలం ఒక స్థానం లభించింది. 47 సీట్లలో పోటీ చేసిన సీపీఎం కేవలం 11 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫార్వర్డ్‌ బ్లాక్, సీపీఐ, ఆర్‌ఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై 13 మంది పోటీ చేయగా, ముగ్గురు విజయం సాధించారు. టౌన్‌ బార్దోవాలీ స్థానంలో పోటీ చేసిన మాణిక్‌ సాహా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆశి‹Ùకుమార్‌ సాహాపై 1,257 ఓట్ల తేడాతో గెలుపొందారు.  

మిస్టర్‌ క్లీన్‌కే మళ్లీ కిరీటం!   
త్రిపురలో మిస్టర్‌ క్లీన్‌గా గుర్తింపు పొందిన సాహా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు.

దంత వైద్యుడైన సాహా గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. 2016లో బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్‌ 3 నుంచి జూలై 4 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. గత ఏడాది జరిగిన టౌన్‌ బార్దోవాలీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ విప్లవ్‌ దేవ్‌ స్థానంలో ఆయనను సీఎంగా నియమించింది. మాణిక్‌ సాహా నిజాతీయపరుడిగా, కష్టపడి పనిచేసే నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. 

నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ–బీజేపీ హవా  
నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(ఎన్‌డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్‌డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి.

ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్‌జేపీ(రామ్‌విలాస్‌ పాశ్వాన్‌) 2, ఆర్‌పీఐ(అథవాలే) 2, ఎన్‌పీఎఫ్‌ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది.

కాంగ్రెస్‌ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్‌డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. 

చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు  
60 ఏళ్ల నాగాలాండ్‌ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్‌డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్‌–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం.            

మేఘాలయలో హంగ్‌!  
మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ కీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. రాష్ట్రంలో హంగ్‌ పరిస్థితులు నెలకొన్నాయి. మేఘలయలో  మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. సోహియోంగ్‌ నియోజకవర్గంలో యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ (యూడీపీ) అభ్యర్థి డొంకుపర్‌ రాయ్‌ లింగ్డో ఫిబ్రవరి 20న మృతిచెందడంతో పోలింగ్‌ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)  అతిపెద్ద పార్టీ గా అవతరించింది.

మెజార్టీ కి కొద్దిదూరంలోనే ఆగిపోయింది. కాన్రాడ్‌  సంగ్మా ప్రభుత్వంలో ఎన్‌పీపీ మిత్రపక్షంగా వ్యవహరించిన యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్‌ 5, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన జాతీయ పార్టీ బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనప్పటికీ ఆశించిన ఫలితందక్కలేదు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్‌పీపీ నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్‌ కే సంగ్మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మద్దతును కోరుతున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌పీపీకి సహకరించాలంటూ తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. నూతన  ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఎన్‌పీపీకి మద్దతు తెలియజేస్తూ లేఖ ఇవ్వబోతున్నామని మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్‌ మారీ చెప్పారు. ముఖ్యమంత్రి సంగ్మా దక్షిణ తురా స్థానంలో గెలిచారు.

మరిన్ని వార్తలు