ఇక ప్రియాంక ఫుల్‌ ఫోకస్‌!

8 Jun, 2023 02:33 IST|Sakshi

రాష్ట్రంలో కాంగ్రెస్‌ వ్యవహారాలన్నీ ఆమె కనుసన్నల్లోనే..  

ఉత్తర్‌ప్రదేశ్‌ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోనున్న ప్రియాంకాగాంధీ... ఈ నెలలోనే అక్కడ కొత్త ఇన్‌చార్జి నియామకం 

తెలంగాణ సహా ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో పూర్తి ప్రచార బాధ్యతలు ప్రియాంకకు అప్పగింత 

రాష్ట్రంలో నెలకో పర్యటన ఉండేలా అధిష్టానం వ్యూహరచన  

సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ అదే తరహా జోరు ను తెలంగాణలోనూ కొనసాగించే క్రమంలో పార్టీ పటిష్టతపై మరింత దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల వ్యవహారాలన్నీ ఇకపై పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కనుసన్నల్లో జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు పూర్తి సమయం కేటాయించేలా ప్రియాంకగాందీని ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని యోచిస్తోంది. సీనియర్‌ నేతలు హరీశ్‌ రావత్, తారిఖ్‌అన్వర్‌లో ఒకరిని అక్కడ నియమించనుంది. ఈ నెలలోనే కొత్త నియామక ప్రక్రియను పూర్తిచేసి ప్రియాంకగాందీని తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో ప్రచారాస్త్రంగా ప్రయోగించనుంది. 

సమన్వయం..ప్రచారం.. సమూహాలతో మమేకం 
కర్ణాటక ఎన్నికల ముందు నుంచే తెలంగాణపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టిన ప్రియాంక ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో ఢిల్లీలో సమావేశాలు నిర్వహించారు. నేతల మధ్య సమన్వయానికి ప్రయత్నాలు చేశారు. అనంతరం ఆమె పూర్తి సమయం కర్ణాటక ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూపు తగాదాలు పెరిగాయని, ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లోలు గ్రూపుల మధ్య వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. మరోవైపు ఢిల్లీలో ఉన్న పెద్దల అండదండలున్నాయంటూ ఎవరి అ నుచరులను వారు ఎమ్మెల్యేల అభ్యర్థులు గా ప్రచారం చేసుకుంటున్నారు.

దీనిపై ఇప్పటికే పార్టీ దూత లు నదీమ్‌జావెద్, రోహిత్‌ చౌదరి అధిస్టాన పెద్దలకు నివేదికలిచ్చారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఇకపై తెలంగాణలో పార్టీని పూర్తిగా గాడిలో పెట్టే బాధ్యతను ప్రి యాంక భుజస్కందాలపై పెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో నిర్వహించే సమావేశాల్లోనూ ప్రియాంక పాల్గొననున్నారు. 

కర్ణాటక ఫార్ములానే ఇక్కడా.. 
ముఖ్యంగా రాష్ట్ర నేతల మధ్య సమన్వయాన్ని పూర్తిగా ఆమె పర్యవేక్షించనున్నారు. కర్ణాటకలో మాదిరే సీనియర్లకు పార్టీ పటిష్టత బాధ్యతలు కట్టబెట్టే వ్యూ హాలను ప్రియాంక అమలుచేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక పర్యటనలు, రోడ్‌షోలు, ర్యాలీలు ఎక్కు వగా ఉండేలా ప్రణాళిక సిద్ధం కానుంది.

కర్ణాటక ఎన్నికల్లో ప్రియాంక 17 రోడ్‌షోలలో పాల్గొనడమే కాకుండా 13 బహిరంగసభలలో ప్రసంగించారు. దీంతోపాటే యువత, మహిళా, కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అనేక దేవాలయాలను సందర్శించారు. ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలుచేసే అవకాశాలున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో కీలంగా వ్యవహరించిన వర్గాలతో మమేకం, అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ఆమె పర్యటనలు రూపొందించనున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా కర్ణాటకలో ‘40 శాతం కమీషన్‌’ప్రభుత్వ నినాదాన్ని ప్రియాంక బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.

అదేరీతిన ఇక్కడి ప్రభుత్వ అవినీతి, కుటుంబపాలన, ఇతర అంశాలు ప్రియాంక ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల మొదలు అక్టోబర్‌ వరకు నెలకో పర్యటన, బహిరంగసభ ఉండేలా పర్యటనల రోడ్‌మ్యాప్‌ సిద్ధమైందని ఏఐసీసీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.  

మరిన్ని వార్తలు