-

పంజాబ్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

28 Sep, 2021 20:45 IST|Sakshi

చంఢీఘడ్‌: పంజాబ్‌  కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.  తాజాగా, పంజాబ్‌ క్యాబినెట్‌ మంత్రి రజియా సుల్తానా సిద్ధూబాటలోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  సదరు మంత్రి మాలేర్‌ కోట్లా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, నవజ్యోతి సింగ్‌ విలువలు ఉన్న నాయకుడని ఆమె కొనియాడారు. పంజాబ్‌ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నేతగా సిద్ధూను రజియా సుల్తానా అభివర్ణించారు.. ఆయన బాటలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తానని తెలిపారు..

రజాయా సుల్తానాతో పాటు... పంజాబ్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ యోగిందర్‌ ధింగ్రా.. అదే విధంగా పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాషియర్‌ గుల్జార్‌ ఇండర్‌ ఛహల్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుస రాజీనామాలతో పంజాబ్‌లో కాంగ్రెస్‌ తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. కాగా, గతంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, నవజ్యోత్‌ సింగ్‌ల మధ్య పలు అంశాలలో బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి చాలా సార్లు ప్రయత్నించింది.

ఈ క్రమంలో.. సిద్ధూకి కాంగ్రెస్‌ అధినాయకత్వం పీసీసీ పదవి అప్పగించింది. కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని కాంగ్రెస్‌ వర్గాలు భావించాయి. కానీ ఆ తర్వాత కూడా సిద్ధూ ఆరోపణలు చేస్తుండటంతో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా చరణ్‌జిత్‌ సింగ్‌ ఛన్నీని పంజాబ్‌ సీఎంగా ఎన్నుకున్నారు. అయితే, సిద్ధూ.. చరణ్‌ జిత్‌సింగ్‌ ఛన్నీ ఎన్నిక పట్ల అంతగా సానుకూలంగా లేరు. తాజాగా, ఛన్నీ చేసిన క్యాబినెట్‌ మార్పుల పట్ల కూడా తీవ్ర అసహనంతో  ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు (మంగళవారం) సిద్ధూ కాంగ్రెస్‌ పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, పలువురు కాంగ్రెస్‌ నాయకులు కూడా ఆ పార్టీని వీడటం ఆ పార్టీని కలవర పరుస్తోంది.

చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్‌: పీసీసీ చీఫ్‌ పదవికి సిద్ధూ రాజీనామా

చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు

మరిన్ని వార్తలు