‘నిరూపిస్తే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా’

17 Sep, 2020 20:12 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అటవీ భూముల ఆక్రమణపై టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపణలను మైదుకూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా ఎంతో మంది పేదలకు పట్టాలు ఇచ్చినట్లు, బి.మఠంలో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. తను అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు చేసిన ఆరోపణలను నెల రోజుల్లో నిరూపించాలని పుట్టా సుధాకర్ యాదవ్‌కు సవాల్‌ విసిరారు. (బలమైన శక్తుల పేర్లు ఉన్నందు వల్లేనా!?)

ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే హక్కు లేదన్నారు. తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. (ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా విజేతలు!)

మరిన్ని వార్తలు