సిద్దిపేట పెత్తనం దుబ్బాకలో నడువది.. హరీశ్‌రావుపై రఘునందన్‌రావు ఫైర్‌

31 Aug, 2022 09:21 IST|Sakshi

దుబ్బాక టౌన్‌: ‘మంత్రి హరీశ్‌.. నీకు దమ్ముంటే దుబ్బాకలో నాపై పోటీకి రా. నీవు ప్రచారం చేసిన దుబ్బాక, హుజూరా బాద్‌లో ప్రజలు నీకు ఎలా గుణపాఠం చెప్పిండ్రో మరచిపోయావా’ అంటూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. దుబ్బాకలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. అబద్ధాలు ప్రచారం చేయడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే హరీశ్‌ పనిగా పెట్టుకున్నాడన్నారు.

దుబ్బాకలో ఇటీవల జరిగిన పింఛన్ల పంపిణీలో ‘దుబ్బాక నియోజకవర్గంలో 50 వేలకు పైగా పింఛన్లు ఇస్తున్నాం’ అని మంత్రి చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. నియోజక వర్గంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో కూడా మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. గుడిసెలు, ఇళ్లు అన్ని కలిపినా నియోజకవర్గంలో 56 వేలు లేవని, మరి అంత మందికి ఎట్లా ఇస్తుండ్రో లిస్టు విడుదల చేయాలన్నారు.

‘హరీశ్‌రావు... దుబ్బాక ఎమ్మెల్యే రిబ్బన్లు కత్తిరించుకుంట తిరుగుతుండంటూ మాట్లాతున్నవు. నేను కత్తిరించకుంటే సిద్దిపేట నుంచి వచ్చి నువ్వు కత్తిరిస్తవ. అవగాహన లేకుండ మాట్లాడకు. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీవు ఒక్కటి అంటే.. నేను నాలుగు అంటా..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలపై అవగాహన లేని ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని వెంటబెట్టుకుని దుబ్బాకలో తిరుగుతూ పిచ్చిపిచ్చిగా వాగడం మానుకోవాలని స్పష్టం చేశారు.
చదవండి: మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు

మరిన్ని వార్తలు