Raghunandan Rao: ‘అలా మాట్లాడటం సరికాదు’.. రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హితవు

4 Aug, 2022 11:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి 2017లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. ఏ వ్యాపారం కోసం, ఎవరి ఏజెంట్‌గా పనిచేయడం కోసం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడికి రేవంత్‌రెడ్డి ఏజెంట్‌ అని, ఆయన వ్యాపారాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరారన్న ఆరోపణలు నిజమని ప్రజలు అనుకోవాలా? అని వ్యాఖ్యానించారు.

14 నెలలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసి విలువలకు కట్టుబడని రేవంత్‌రెడ్డి, ఇప్పుడు విలువలు, వ్యాపారాలు, ఇతర శాసనసభ్యుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. బుధవారం ఢిల్లీలో రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి విలువలున్న వ్యక్తి కాబట్టే కాంగ్రెస్‌ పార్టీ బీ ఫారంతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ప్రకటించారని తెలిపారు.  

మరిన్ని వార్తలు