‘మోదీ నిర్ణయంతో కోట్లాది జీవితాలు రోడ్డున పడ్డాయి’

24 Dec, 2020 12:47 IST|Sakshi

రాష్ట్రపతిని కలిసిన రాహుల్‌గాంధీ బృందం

సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నాయకుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు  విజ్ఞాపన పత్రం అందజేసింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి, ఆ పత్రాలను రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడూతూ.. నూతన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోకపోతే దేశం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు.

ప్రధాని మోదీ రైతుల కోసం కాకుండా కార్పొరేటర్ల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ఇద్దరు,ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ నిర్ణయాలతో కోట్లమంది జీవితాలు రోడ్డునపడుతున్నాయి విమర్శించారు. దేశంలో పెను విధ్వంసానికి దారితీసే నిర్ణయాలు మోదీ ప్రభుత్వం తీసుకుంటుదని దుయ్యబట్టారు. రైతులు తమ డిమాండ్ల కోసం చట్టబద్ధంగా పోరాడుతున్నారని, వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని రాహుల్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు