UP CM Post: మాయావతికి సీఎం పోస్ట్‌ ఆఫర్‌ చేశాం

10 Apr, 2022 05:58 IST|Sakshi

యూపీ ఎన్నికల సమయంలో పరిణామాలపై రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఆఫర్‌ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. సీబీఐ, ఈడీ, పెగసస్‌ల భయంతోనే ఆమె బీజేపీ విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు.

సమృద్ధ్‌ భారత్‌ ఫౌండేషన్‌ ప్రచురించిన ‘ది దళిత్‌ ట్రూత్‌’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాహుల్‌ ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఒక ఆయుధమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ అభివర్ణించారు. ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) హస్తగతం చేసుకుందని ఆరోపించారు. రాజ్యాంగంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.‘కేవలం అధికారం చేజిక్కించుకోవడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించే కొందరు రాజకీయ నేతల వంటి వాడిని కాదు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. అదేవిధంగా, తీవ్రంగా కొట్టి హింసింది. నేనింకా నేర్చుకోవాలని దేశం భావిస్తున్నట్లు దాని ద్వారా తెలుసుకున్నాను’అని అన్నారు.

మరిన్ని వార్తలు