Rahul Gandhi: నేను నికార్సైన హిందువును.. హిందూత్వవాదిని కాదు

13 Dec, 2021 03:49 IST|Sakshi
జైపూర్‌ సభలో అభివాదం చేస్తున్న సోనియాగాంధీ, రాహుల్, సీఎం గహ్లోత్, కమల్‌నాథ్‌

భారత్‌ హిందూత్వవాదులది కాదు

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ స్పష్టీకరణ

ఇది హిందువుల దేశం.. హిందూత్వవాదులను తరిమికొట్టాలి

ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా జైపూర్‌లో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ

జైపూర్‌: భారత్‌ హిందువుల దేశమని, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడే హిందూత్వవాదులది కాదని కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణానికి, ప్రజల కష్టాలకు హిందూత్వవాదులే కారణమని దుయ్యబట్టారు. వారికి అధికారమే పరమావధి అని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో ఆదివారం కాంగ్రెస్‌ నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు.

మోదీ, ఆయన సంపన్న మిత్రులు కలిసి గత ఏడేళ్లలో దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హిందూ, హిందూత్వ వేర్వేరు పదాలు అని చెప్పారు. రెండు ప్రాణుల్లో ఒకే ఆత్మ ఉండనట్లుగానే, రెండు పదాలకు ఒకే అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ హిందువు, గాడ్సే హిందూత్వవాది అని అన్నారు.  2014 నుంచి భారత్‌లోని హిందూత్వవాదులు ఇదే సిద్ధాంతం పాటిస్తున్నారని విమర్శించారు.  తాను నికార్సైన హిందువునని, హిందూత్వవాదిని కాదని తేల్చిచెప్పారు.

హిందూత్వవాదులు నిక్షేపంగా ఉన్నారు
హిందూత్వవాదులను మరోసారి తరిమికొట్టాలని, దేశంలో హిందువుల పరిపాలనను పునఃప్రతిష్టించాలని ప్రజలకు రాహుల్‌ పిలుపునిచ్చారు. õ దేశంలో 20 కంపెనీలే 90 శాతం కార్పొరేట్‌ లాభాలను కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ ర్యాలీని కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులు కూడా కార్పొరేట్ల బానిసలేనని అన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతుల రుణాలను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రద్దు చేశాయని, మోదీ ప్రభుత్వం మాత్రం రైతులకు  హిందూత్వవాది కాబట్టే మోదీ రైతులను వెనుక నుంచి పొడిచాడని చెప్పారు.

రైతన్నలు ఎదురుతిరిగితే హిందూత్వవాది తోకముడిచి, క్షమాపణ చెప్పడం ఖాయమన్నారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ..70 ఏళ్లలో కాంగ్రెస్‌ కష్టపడి నిర్మించిన దేశాన్ని కార్పొరేట్‌ మిత్రులకు అమ్మేసేందుకు మోదీ సర్కారు కుతంత్రాలు సాగిస్తోందని ఆరోపించారు.   ర్యాలీలో కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. కానీ, ప్రసంగించలేదు. రాజస్తాన్‌ Ðసీఎం గహ్లోత్, చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ హాజరయ్యారు.  కాగా, ఈ ర్యాలీ వద్దకు పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఆలస్యంగా చేరుకున్నారు

అదానీ, అంబానీకే అచ్ఛే దిన్‌
మంచి రోజులు(అచ్ఛే దిన్‌) వస్తాయంటూ దేశ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారని, కానీ ఆ మంచి రోజులు అదానీకి, అంబానీకి మాత్రమే వచ్చాయని రాహుల్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయినా ఆ తప్పు అదానీ, అంబానీది కాదని, వారికి దోచిపెట్టే ప్రధానిది అని అన్నారు.  మోదీ నిర్వాకాలతో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించలేరని అన్నారు. లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు, రైతులే ఆ పని చేయగలరని చెప్పారు. మోదీ పాలనలో అసంఘటిత రంగం పూర్తిగా కునారిల్లిందన్నారు. లద్దాఖ్, అరుణాచల్‌లో భారత్‌ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తే, అలాంటిదేమీ లేదని ప్రధాని బుకాయిస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు