నరేంద్ర మోదీని నాగపూర్‌కు తరిమేద్దాం: రాహుల్‌ గాంధీ

1 Mar, 2021 00:26 IST|Sakshi
ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరునల్వేలిలోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో బాలుడితో రాహుల్‌ గాంధీ 

తమిళనాడు ప్రజలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పిలుపు  

సాక్షి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కేంద్రం నాగపూర్‌కు అహింసా మార్గంలో తరిమేద్దామని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు రాహుల్‌ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం తమిళనాడులోని తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. చర్చా కార్యక్రమాలు, రోడ్‌ షోలలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంతో చాలా ఇబ్బందులు ఉన్నాయని వివరించారు.

ఎవరినీ సంపద్రించకుండా, సలహాలు తీసుకోకుండా ఈ విధానాన్ని తీసుకొచ్చి కేంద్రం పెద్ద తప్పు చేసిందని ధ్వజమెత్తారు. విద్యా రంగానికి, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే రీతిలో విధానాలు ఉండాలన్నారు. దేశ స్వాతంత్య్ర కోసం 70 ఏళ్ల క్రితం అహింసా మార్గంలో ఆంగ్లేయుల్ని వారి దేశానికి పంపించేశామని గుర్తు చేశారు. అదే మార్గంలో మోదీని నాగపూర్‌కు తరిమేద్దామన్నారు. చర్చ కార్యక్రమంలో ఓ ప్రొఫెసర్‌ మాట్లాడుతుండగా మైక్‌ పలుమార్లు మొరాయించింది.  ఇదే పరిస్థితి పార్లమెంట్‌లో తనకు ఎన్నోసార్లు ఎదురయ్యిందని రాహుల్‌ గాంధీ గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు