Rahul Gandhi Telangana Tour: రాహుల్‌కు వెల్‌కమ్‌ అంటూనే సెటైర్లు.. ‘చూసుకొని మురవాలి’ రేవంత్‌రెడ్డి కౌంటర్‌

6 May, 2022 12:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌, అధికార టీఆర్‌ఎస్‌ మధ్య ట్వీట్ల వార్‌ ఊపందుకుంది. శుక్రవారం ఉదయం కీలక నేతలైన కేటీఆర్‌, కవిత, రేవంత్‌ రెడ్డి మధ్య ఈ యుద్ధం సాగడం విశేషం.

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణదేనని, ఆ విషయం అర్థం చేసుకునేందుకు అయినా మీకు స్వాగతం అంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి కవిత కల్వకుంట్ల ట్వీట్‌ చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, అంశాలను మీరు(రాహుల్‌ గాంధీని ఉద్దేశించి) ఎన్నిసార్లు ప్రస్తావించారు?, టీఆర్‌ఎస్‌ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతుంటే ఎక్కడ ఉన్నారు అంటూ నిలదీశారామె. 

దీనికి తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. చూసుకొని మురవాలి.. చెప్పుకొని ఏడ్వాలి అంటూ ఆమె ట్వీట్‌కు రీ ట్వీట్‌ చేశారు.    

అలాగే రైతుల పక్షపాత ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో పర్యటనకు రాహుల్‌ గాంధీకి స్వాగతం చెబుతామని, ఇక్కడి విధీవిధానాలు నేర్చుకుని కాంగ్రెస్‌ విఫలిత రాష్ట్రాల్లో అమలు చేసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అంటూ ఓ కథనాన్ని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేయగా..  

మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్!.. రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి? ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలి? వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు?.. ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు అంటూ ట్వీట్‌తోనే బదులిచ్చారు. ఇదిలా ఉండగా.. వరంగల్‌లో నిర్వహించబోయే రాహుల్‌సభకు భారీ జన సమీకరణ చేపడుతున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు.

చదవండి: మేధావులు, క్యారెక్టర్‌ ఉన్న వారినే పిలుస్తారు

మరిన్ని వార్తలు