దుబ్బాక: టీఆర్‌ఎస్‌ తరఫున రంగంలోకి ఆమె!

14 Sep, 2020 19:52 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో నిలవనున్నారు. ఇందుకు సంబంధించి గులాబీ దళ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దీనిని సంబంధించి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజాత పేరు ఏకగ్రీవం కావడంతో దుబ్బాక, సిద్ధిపేటలో సోలిపేట కుటుంబ అనుచర వర్గం సంబరాలు చేసుకుంటోంది. (చదవండి: దుబ్బాకపై టీఆర్‌ఎస్‌ కన్ను)

మరోవైపు.. టికెట్‌ ఆశించి భంగపడి. అసంతృప్తితో ఉన్న చెరకు ముత్యరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నారు. కాగా సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కుటుంబానికి బాసటగా ఉంటానని, రాజకీయంగా ఆదుకుంటామని కేసీఆర్‌ అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న సందర్భంలోనే, ఆయన అకాల మృతి నేపథ్యంలో సోలిపేట కుటుంబానికి కూడా హామీ ఇచ్చారు. దీంతో ఇరువురు నేతల తనయులు టిఆర్ఎస్ పార్టీ నుంచి  టికెట్‌ ఆశించగా.. చివరికి సోలిపేట సతీమణి సుజాతకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.(చదవండి: ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!)

మరిన్ని వార్తలు