-

కేసీఆర్‌ ఫాంహౌస్ భూములు పోతాయనే 'రీజినల్‌' అలైన్‌మెంట్‌ మార్పు

27 Sep, 2022 08:07 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్ భూములు పోతాయనే అలైన్‌మెంట్‌ మార్చారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వాస్తానికి రింగ్‌రోడ్డు.. సంగారెడ్డి చౌరస్తా నుంచి సదాశివపేట, సీఎం ఫాంహౌస్‌æ మీదుగా వెళ్లాల్సి ఉండగా దాని అలైన్‌మెంట్‌ మార్చిన కారణంగా భువనగిరి పట్టణం, కలెక్టరేట్‌ను అనుకొని ఉన్న రాయగిరి భూములు పోతున్నాయన్నారు. యాదాద్రి జిల్లా రాయగిరి రైతులు సోమవారం ఎంపీ వెంకట్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.

ఆయన రైతులతో మాట్లాడుతూ.. రైతుల కోసం తాను ఎంతటి త్యాగానికి, పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌   ఇంకా ఫైనల్‌ కాలేదని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని.. దసరా తర్వాత మరోసారి ఢిల్లీకి వెళ్లి గడ్కరినీ కలుద్దామని రైతులకు చెప్పారు. అంతకుముందు రాయగిరి, చౌటుప్పల్‌ మండలం భూనిర్వాసితులు యాదాద్రి కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి వారి నుంచి వినతిపత్రం తీసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.
చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు

మరిన్ని వార్తలు