Revanth Reddy: మోదీ, షా దేశాన్ని అంబానీ, అదానీకి కట్టబెడుతున్నారు

2 Oct, 2021 13:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'దేశ యువత గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఫాసిస్టులకు వ్యతిరేకంగా గాంధీ చూపిన దారిలో యువత పోరాటం చేయాలి. మోదీ, అమిత్‌ షా దేశాన్ని అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారు. దేశ భవిష్యత్‌ను వారి చేతుల్లో పెడుతున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి.

డిఫెన్స్‌లో ప్రైవేట్‌కు అనుమతిస్తే దేశ భద్రతకే ముప్పు. తెలంగాణలో అమరుల కుటుంబాలు అనాధలైనవి. యువత రోడ్లమీద పడ్డది. గులాబీ చీడ నుంచి విముక్తి కల్పించడానికి కాంగ్రెస్‌ కార్యక్రమం తీసుకుంది. విద్యార్థి, నిరుద్యోగుల ఆశయాల కోసం జంగ్‌ సైరన్‌ మోగిస్తుంది. ర్యాలీ కోసం వస్తున్న కాంగ్రెస్‌ నేతలను, విద్యార్థులను అరెస్ట్‌ చేస్తున్నారు. కేసీఆర్‌కు కాలం చెల్లింది. శాంతియుతంగా జరగాల్సిన ర్యాలీని రసాభాసగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలి లేదంటే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత' అంటూ పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.   

ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ మాట్లాడుతూ.. 'త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. శాంతి యుతంగా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల కోసం జంగ్‌ సైరన్‌ ప్రారంభించాం. శాంతి యుతంగా చేయబోతున్న కాంగ్రెస్‌ నాయకుల పాదయాత్రను భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. పోలీస్‌లు టీఆర్‌ఎస్‌గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారు. అరెస్టులు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేసి పాదయాత్ర శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి' అని అన్నారు. 

చదవండి: (గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు)

మరిన్ని వార్తలు