తన వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారా?

21 Jul, 2021 01:14 IST|Sakshi

ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్‌ హ్యాకింగ్‌  

మోదీ, అమిత్‌ షాలు దేశ ద్రోహానికి పాల్పడ్డారు 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సైతం తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడేనని, విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్‌ హ్యాకింగ్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు కిషన్‌ రెడ్డి కట్టుబడి ఉన్నారా? అని నిలదీశారు. ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై గతంలో ఆరోపణలు చేసిన కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ కేబినెట్‌ హోదా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్‌ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు దేశ ద్రోహానికి పాల్పడ్డారని విమర్శించారు. అమిత్‌ షా రాజీనామా చేయాలని, పెగాసస్‌ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  
ఈనెల 22న చలో రాజ్‌భవన్‌ 
సీఎం కేసీఆర్‌ సైతం ప్రతిపక్ష నేతలు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లను హ్యాక్‌ చేశారని రేవంత్‌ ఆరోపించారు. తెలంగాణలో ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉందని, ఈనెల 22న ఉదయం 11 గంటలకు చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు వ్యవహార శైలిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్ర నిధులను ఇజ్రాయెల్‌ నుంచి ఫోన్‌ హ్యాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు వినియోగించారని ఆరోపించారు.   

మరిన్ని వార్తలు