కరోనా కంటే కేసీఆర్‌ డేంజర్‌

1 Jul, 2021 04:08 IST|Sakshi

ఏ రాత్రి ఎన్నికలంటాడో తెలియదు.. సిద్ధంగా ఉండండి 

టీపీసీసీ కొత్త కార్యవర్గం భేటీలో రేవంత్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కంటే సీఎం కేసీఆర్‌ ప్రమాదకారి అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ వచ్చిందని, అదే విధంగా కేసీఆర్‌ గద్దె దిగాలంటే ఎన్నికలు రావాలని, ఎన్నికలే రాష్ట్రానికి సర్వరోగ నివారిణి అని అన్నారు. బుధవారం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ నివాసంలో జరిగిన టీపీసీసీ కొత్త కార్యవర్గం, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.

సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయిస్తున్నారని, బీసీలకు కార్పొరేషన్‌ రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కేసీఆర్‌ హయాంలో బాగా నష్టపోతున్నారని చెప్పారు. కేసీఆర్, ఆయన తనయుడు అమరవీరుల స్తూపాన్ని కూడా వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారని, వీరి అవినీతి వ్యవహారాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. తెలంగాణలో చదువుకున్న యువత తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తమ మొదటి ప్రణాళిక నిరుద్యోగ సమస్యలపైనే ఉంటుందని చెప్పారు. తాను సోనియా మనిషినని చెప్పిన రేవంత్‌... కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర పార్టీల్లో పనిచేశానన్నారు.  

జిల్లాల అధ్యక్షుల తీర్మానం 
రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని డీసీసీ అధ్యక్షుల సమావేశం సమర్థించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌లకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.  

మరిన్ని వార్తలు