7న బాధ్యతలు చేపడతా...

28 Jun, 2021 01:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూలై 7వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటానని కొత్త టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తాను పాదయాత్ర చేసే అవకాశం ఉందని, అయితే అదెప్పుడన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా తాను వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోబోనని, సమష్టి నిర్ణయాలే ఉంటాయని స్పష్టం చేశారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, కార్యకర్తల కష్టం ఇప్పుడు తిరుగుబాటుగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, ఎంఐఎం బలమెంతో బీజేపీదీ అంతేనని వ్యాఖ్యానించారు. 

రాముడి పేరు ఎత్తే అర్హత లేదు
లింగోజిగూడలో టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని అన్న రేవంత్‌రెడ్డి.. లింగోజిగూడ విషయంలో బీజేపీ నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లడంపై కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాముడి పేరు ఎత్తేందుకు బీజేపీ నేతలకు అర్హత లేదని, అయోధ్యలో రాముని భూములను తెగనమ్ముకున్నారని ఆరోపించారు. మోదీ ఇప్పుడు గడ్డం పెంచి సన్యాసి అవతారం ఎత్తారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్, వైఎస్‌లను విమర్శించడం వికృత చర్య అవుతుందని, వైఎస్‌ను తిడితే రాష్ట్రానికి ఒక్క చుక్కయినా అదనంగా నీరు వస్తుందా అని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్‌ కలిసే ఉన్నారని, కాంగ్రెస్‌ను బలహీనపరచి షర్మిల పార్టీని బలోపేతం చేయడానికే వైఎస్‌ను టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేసిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ,    

చదవండి: రేవంత్‌కు పోస్ట్‌: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు 
అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్‌!

మరిన్ని వార్తలు