Minister RK Roja: అసలైన ఉన్మాది చంద్రబాబే..

24 Apr, 2022 04:38 IST|Sakshi
స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటున్న మంత్రి రోజా. చిత్రంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

మంత్రి రోజా ధ్వజం 

ఆడపిల్లల రక్షణ కోసం చంద్రబాబు ఏనాడైనా కృషి చేశాడా? 

విజయవాడ ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ తక్షణమే స్పందించారు 

పెందుర్తి: రాష్ట్రంలో అసలు సిసలైన ఉన్మాదిలా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. 14 ఏళ్ల పాలనలో మహిళల రక్షణ కోసం చంద్రబాబు ఏనాడైనా పని చేశాడా.. అని ప్రశ్నించారు. శనివారం విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి రోజా చినముషిడివాడలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైందన్నారు.

ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి తక్షణమే విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో తహసీల్దార్‌ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడిని, విజయవాడలో టీడీపీ నాయకుడు ఓ యువతిపై లైంగికదాడికి యత్నించినప్పుడు చంద్రబాబు ఎక్కడ దాక్కున్నాడని ధ్వజమెత్తారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై తాను ప్రశ్నించినప్పుడు తనను ఏడాది పాటు సస్పెండ్‌ చేయడం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మంత్రి రోజా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని పర్యాటక కేంద్రాలపై షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తామన్నారు.  

శ్రీశారదా పీఠం సందర్శన..
విశాఖ శ్రీశారదాపీఠాన్ని మంత్రి రోజా శనివారం సందర్శించి, రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె వెంట ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఉన్నారు. 

మరిన్ని వార్తలు