ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, మచిలీపట్నం: ‘నాడు చంద్రబాబు నాయుడు పాలనలో టీడీపీ వాళ్లు అసెంబ్లీ సాక్షిగా నన్ను అవమానించారు. మహిళ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. స్పృహ తప్పి పడివున్న నన్ను వాహనంలో తీసుకెళ్తున్న విషయం తెలుసుకున్న జగనన్న కాపాడారు’ అని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గుర్తు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం వైఎస్సార్–పీకేఎం కప్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన రోజా
మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలను వివరించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో చంద్రబాబు ఆదేశాలతో మహిళ అని కూడా చూడకుండా తనను నానా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. ఆ సమయంలో జగనన్న, మంత్రి పేర్ని నాని వచ్చి అడ్డుకుని తనను కాపాడారన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళల గురించి మాట్లాడుతూ రోజా ఈ ప్రస్తావన చేశారు.