బాలకృష్ణకు ప్రజల కష్టాలు తెలియదా? ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు: మంత్రి రోజా

15 Jan, 2023 15:46 IST|Sakshi

సాక్షి, అన్నమయ్య: రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఆర్కే రోజా. జిల్లాలోని సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కుటుంబ సభులతో కలిసి పండగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఒక చెల్లిగా, హీరోయిన్‌గా, మంత్రిగా ప్రతి ఏడాది ఇక్కడే పండగ చేసుకుంటున్నానని గుర్తు చేసుకున్నారు.

సంక్రాంతి రైతుల పండుగ అని.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి రోజా పేర్కొన్నారు. వైఎస్సార్‌ కుటుంబ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటారని అన్నారు. అదే విధంగా చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలని హితవు పలికారు. బాలకృష్ణ ఎవరన్న స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్దం కావడం లేదని విమర్శించారు. స్క్రిప్ట్‌లు రాసి ఇచ్చినా మాట్లాడలేని పరిస్దితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. 11మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని మంత్రి రోజా ప్రశ్నించారు.

‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని బాలకృష్ణ ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదం. అల్లుడు, కూతురు బాగుండాలని తన బావ మెప్పుకోసం ఇలా మాట్లాడి ఉండొచ్చు. అన్‌స్టాపబుల్‌లో ఎన్టీఆర్‌పై జరిగిన చర్చ స్క్రిప్ట్‌ అని ప్రజలందరూ భావిస్తున్నారు. చంద్రబాబు మోసాన్ని కప్పిపుచ్చేలా షో నడిపారు. ఎవరు చచ్చినా పరవాలేదు. నా బావ మీటింగ్ జరగాలి. నా బావ కళ్ళలో ఆనందం చూడాలని బాలకృష్ణ అనుకుంటున్నారు. బాలకృష్ణకు తెలియదా ప్రజల కష్టాలు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా?

మూడు పంటలు పండే భూమిని ఎవరో స్వామీజి చెప్పారని బీడు భూమి చేశారు. మహిళా సదస్సుకు రమ్మని నన్ను చంపాలని చూశారు. బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు. పవన్ లాగా రెండు సార్లు ఓడిపోలేదు. జీవో నంబర్ వన్ పూర్తిగా చదివితే బాలకృష్ణ తను మాట్లాడిన ఎమర్జెన్సీ అనే మాట వెనక్కి తీసుకుంటారు. ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు.. నీతి మాలిన చర్య. సినిమాలో ఎన్ని డైలాగులు చెప్పినా చప్పట్లు కొట్టుకోవడానికే తప్ప ప్రజల సమస్యలు తీరవు’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
చదవండి: ఎత్తిపోతలకు గట్టిమేలు.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు