అధికారంలో చాలా ఏళ్లుగా బీజేపీ.. ప్రజలు విసిగిపోయారు.. వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇదే!

24 Aug, 2022 15:23 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో బీజేపీ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అంచనా వేశారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులతో 12 గంటల మారథాన్ సమావేశంలో మాట్లాడుతూ కేసీ వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి, గుజరాత్ ఎన్నికల పరిశీలకుడు అశోక్ గహ్లోత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

గుజరాత్‍లో  ఇటీవల కల్తీమద్యం కారణంగా చాలా మంది చనిపోయిన విషయాన్ని కూడా వేణుగోపాల్ ప్రస్తావించారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు కూడా ఎక్కువయ్యాయని ఆరోపించారు. గజరాత్ ప్రభుత్వం అవినీతి, అసమర్థంగా మారిందని ధ్వజమెత్తారు. అందుకే గతేడాది మంత్రివర్గం మొత్తాన్ని మార్చారని పేర్కొన్నారు. ఇటీవలే ఇద్దరు బీజేపీ నేతలను మంత్రి పదవుల నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

గుజరాత్‌లో 90 రోజుల ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ బుధవారం ప్రారంభించింది. ఈ సారి ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్నామని, అందరం ఐకమత్యంతో పోరాడుతామని వేణుగోపాల్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏమాత్రం ప్రభావం చూపదని అంతా అనుకున్నారని కానీ కొద్ది సీట్ల తేడాతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. ఈసారి బీజేపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నందున కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు.
చదవండి: జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు

మరిన్ని వార్తలు