భారత్‌ బంద్‌.. గుజరాత్‌ సీఎం ఎద్దేవా

8 Dec, 2020 14:30 IST|Sakshi

గాంధీనగర్‌: కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు రైతులకు మద్దతుగా రోడుపైకి వచ్చి నిరసన తేలుపుతున్నాయి. కానీ గుజరాత్‌లో మాత్రం భారత్‌ బంద్‌ పాటించమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఉత్తర గుజరాత్‌లోని మెహసానాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు రూపానీ. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీపై విమర్శలు చేశారు. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలియని రాహుల్‌ రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. విజయ్‌ రూపానీ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని, విపక్షాలను తరిమి కొట్టారు. ఇప్పుడు వారు రైతులకు మద్దతు తెలపుతున్నాం అంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్‌ ఈ ప్రశ్నకు సమాధానం చెబితే నీకు వ్యవసాయం, రైతుల గురించి ఏ మేరకు అవగాహన ఉందో అందరికి అర్థమవుతుంది. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలుసా నీకు.. సమాధానం చెప్పు’ అంటూ రూపానీ ఎద్దేవా చేశారు. (చదవండి: విశ్వాస పునరుద్ధరణ కీలకం)

అంతేకాక నరేంద్ర మోదీ ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలని సాల్వ్‌ చేస్నున్నారని తెలిపారు రూపానీ. ‘ప్రస్తుతం రైతుల పేరు చెప్పి కాంగ్రెస్‌ లబ్ది పొందాలని భావిస్తుంది. కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ విద్యుత్‌, విత్తనాలు, ఎరువులు, కనీస మద్దతు ధర, సాగు నీరు వంటి అంశాల గురించి అస్సలు పట్టించుకోలేదు. బీజేపీ హయాంలో వీటన్నింటిని సాధిస్తుంటే తట్టుకోలేకపోతుంది’ అంటూ  రూపానీ విమర్శించారు. 

మరిన్ని వార్తలు