అతి త్వరలో సీఎంగా సచిన్ పైలట్.. హింట్ ఇచ్చిన మంత్రి

23 Sep, 2022 19:36 IST|Sakshi

జైపూర్‌: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అతి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుఢా. ఎ‍మ్మెల్యేలందరి మద్దతు ఆయనకు ఉందని స్పష్టం చేశారు. సీఎం అశోక్ గహ్లోత్‌కు మద్దతు తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సచిన్ పైలట్‌ వైపే ఉంటారని పేర్కొన్నారు. గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే పైలట్ సీఎం అవుతారని, అధిష్ఠానం నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించరని చెప్పారు.

2018లో జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో  రాజేంద్ర గుఢా ఒకరు. ఆ తర్వాత వీరంతా తమ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజేంద్రకు మంత్రి పదవి దక్కింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు మద్దతుగానే ఉంటారని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

అక్టోబర్ 17న జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గహ్లోత్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే తాను అధ్యక్షుడినైనా సీఎంగా కొనసాగుతానని గహ్లోత్ అన్నారు. రెండు బాధ్యతలూ చేపట్టగలనని పేర్కొన్నారు.

కానీ రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఒక్కరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను గుర్తు చేశారు. దీంతో గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, యువ నేత సచిన్ పైలట్‌ రాజస్థాన్ సీఎం కావడం ఖాయం. ఆయన రాహుల్‌కు సన్నిహితుడు కావడమే గాక, రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో మంచి ఆదరణ ఉంది.
చదవండి: బీజేపీకి వెన్నుపోటు పొడిచాడు: అమిత్‌షా

>
మరిన్ని వార్తలు