ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రావు

18 Jan, 2021 10:02 IST|Sakshi

తిరుమలగిరి: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆదివారం నాగార్జునసాగర్‌లోని జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్, బీజేపీలు డిపాజిట్ల కోసం పోరాడాల్సిందేనన్నారు.(చదవండి: గోల్కొండపై జెండా ఎగరేద్దాం: బండి)

ఎప్పటిలాగే ప్రజలను మాయమాటలతో మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని, ఈసారి ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. తన హయాంలోనే నాగార్జునసాగర్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందే తప్ప ఈ ఆరేళ్ల కాలంలో అణువంత కూడా అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఎన్నికలప్పుడు మాత్రమే అధికార పార్టీకి హామీలు గుర్తుకువస్తాయని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు