చంద్రబాబు తన కొడుక్కి ఏం నేర్పుతున్నట్టు?: సజ్జల

3 Jun, 2023 19:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు చీకటి పాలనను జనం మర్చిపోలేదని.. మ్యానిఫెస్టోతో ఏదో నమ్మిద్దామంటే జనం నమ్మరని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఏం మాట్లాడినా అది పగటి కలగానే ఉంటుందని ఎద్దేవా చేశారు. చాలా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడే తీరు కరెక్టుగా లేదన్నారు.

‘‘2014లో ఏం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు? ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టో తెచ్చి ఇక్కడి ప్రజల్ని నమ్మిస్తానంటే ఎలా?. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక పోయానని జనానికి చెప్పాలి. లోకేష్ ఏం నాయకుడో అర్థం కావటం లేదు. పోస్టర్ పట్టుకుని దూషణలు చేస్తుంటే ఇంతటి చిల్లరగాడా అనిపించింది. చంద్రబాబు తన కొడుక్కి ఏం నేర్పుతున్నట్టు?. ఇలాంటి మాటల వలన ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.

‘‘తండ్రీ కొడుకులు బూతులు, అబద్దాలు చెప్పటమే పనిగా పెట్టుకున్నారు. రాజ్యసభ టిక్కెట్లు అమ్ముకున్న ఘనత చంద్రబాబుది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ లాలూచీ వ్యవహారాలు చేయలేదు. ఇప్పుడు టిక్కెట్లు ఆరోపణలు మాపై చేయటం దుర్మార్గం. పారదర్శకంగానే ఆయన వ్యవహరిస్తారు. నా రాష్ట్రం, నా ప్రజలు అనే ఆలోచనలోనే జగన్ ఎప్పుడూ ఉంటారు. జగన్ ప్రధానిని‌ కలిస్తే తాటాకలు కట్టి ప్రచారాలు చేస్తారు. మరి చంద్రబాబు ఎలా కలుస్తున్నాడంట?. చంద్రబాబు.. మోదీ, అమిత్ షాలను ఎందుకు కలుస్తున్నాడో ఊహించుకోవచ్చు. టీడీపీని కాపాడుకునే ప్రయత్నాల కోసం వెళ్తున్నారేమో?’’ అంటూ చంద్రబాబును దుయ్యబట్టారు.
చదవండి: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. ఏపీ సర్కార్‌ కీలక ప్రెస్‌మీట్‌ 

‘‘పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తే మంచిదే. మేము మొదట్నుంచీ చెప్తున్నదీ అదే. నాయకులు ప్రజల్లోనే ఉండాలని చెప్తున్నాం. జగన్ సొంత నాయకత్వంతో ఎదిగారు. పవన్ కళ్యాణ్ కులం పేరుతో రాజకీయాలు చేస్తే ఫలితం ఉండదు. గెస్టు ఆర్టిస్టుల్లాగా వచ్చిపోవటం  మంచిది కాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేరే రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
చదవండి: బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు?

మరిన్ని వార్తలు