'కాకి లెక్కల బాబు.. చొక్కాలు మార్చేస్తున్నారు'

22 Sep, 2020 09:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ట్విటర్‌ వేదికగా విమర్శించారు. 'చంద్రబాబు గతాన్ని ఒక్కసారి చూడండి. యునైటెడ్‌ ఫ్రంట్‌ ఉండగా సెక్యులర్‌ చొక్కా వేసుకున్నారు. పరాజయం తప్పదని తెలిసి స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉండి కూడా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయేవైపు పరుగెత్తారు. వెంటనే చొక్కా మార్చేసి కాషాయవాదిగా అవతారం ఎత్తారు. 2004లో ఎన్డీయే ఓడిపోయినప్పడు భవిష్యత్తులో ఎన్నడూ బీజేపీతో కలవనంటూ ఆ చొక్కావదిలేసి మళ్లీ సెక్యులర్‌ చొక్కా వేసుకున్నారు. (చదవండి : ధర్మంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు) 

2014లో మోదీ గాలి ఉందనేసరికి మళ్లీ చొక్కా మార్చారు. 2019లో కాకిలెక్కలు వేసి తానొక జాతీయ నాయకుడిగా, దేశ రక్షకుడిగా అవతారం ఎత్తారు. బోర్లాపడ్డాక తన ఎంపీలందర్నీ బీజేపీలోకి పంపి, ఢిల్లీ కరుణ కోసం మళ్లీ చొక్కామార్చి  తానొక కాషాయవాది అన్నట్టు కనికట్టు చేస్తున్నారు. మళ్లీ ఈ చొక్కాను ఏ క్షణానైనా చంద్రబాబు మార్చేయగలరు. ' అంటూ ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు