రామసుబ్బారెడ్డికి సముచిత స్థానం

10 Apr, 2021 03:35 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు..

ప్రభుత్వ సలహాదారు సజ్జల 

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రామసుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఏడాది క్రితమే రామసుబ్బారెడ్డి పార్టీలోకి వచ్చారని, క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆలోచనలపై చర్చించడానికి కోవిడ్, ఇతర అంశాలు అడ్డం వచ్చాయని తెలిపారు.

వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నుంచి 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయించగా, డాక్టర్‌ సుధీర్‌రెడ్డి కష్టకాలంలో ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి, 2019 ఎన్నికల్లో గెలిచారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు నుంచి సుధీర్‌రెడ్డినే మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తానని సీఎం చెప్పారని తెలిపారు. రామసుబ్బారెడ్డి ఆయనతో సమన్వయం చేసుకుని పని చేస్తారన్నారు. శాసనమండలిలో ఆయనకు చోటు కల్పించి ఆయన అనుభవాన్ని వాడుకుంటామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారన్నారు. జగన్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని రామసుబ్బారెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు