రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ విడ్డూరం

17 Jun, 2021 14:48 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రతిపక్షం కపటప్రేమ కనబరుస్తోందని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టీడీపీ హయాంలోని బకాయిలను తమ ప్రభుత్వం తీర్చిందని గుర్తు చేశారు.

టీడీపీ హయాంలోని చీకటి రోజులు ఇంకా ప్రజలు మరిచిపోలేదన్నారు. ప్రజా జీవనాన్ని ఒక గాడిమీదకు తీసుకొచ్చిన ప్రభుత్వం మాదని తెలిపారు. కౌలు రైతులకు టీడీపీ హయాంలో చేసిందేమీ లేదని.. చంద్రబాబు లేఖలో రాసిన అంశాలన్నీ అబద్ధాలు, అవాస్తవాలు అని ఆయన కొట్టిపారేశారు. ‘‘సీఎం వైఎస్‌ జగన్‌ పాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది. విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతుకు లాభసాటిగా ఉండాలి. రైతులు తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని’’ సజ్జల  అన్నారు. ఆదాయపు పన్ను విషయంలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారని.. కేంద్రం, 15వ ఆర్థిక సంఘం సూచనలనే అమలు చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

చదవండి: బాబు అను‘కుల’ మీడియా చౌకబారు కుతంత్రాలు
ఏపీ: పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎటువంటి చర్చ జరగలేదు

మరిన్ని వార్తలు