వాస్తవాలు చెబుతున్నా అబద్దాలు ఆపడం లేదు

10 May, 2021 15:36 IST|Sakshi

చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు

సాక్షి, తాడేపల్లి : గత పది రోజులుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ఆయన అనుకూల మీడియా ఈనాడు, ఏబీఎన్, టీవీ5లు వ్యాక్సినేషన్‌పై పనిగట్టుకుని కుట్రపూరితంగా విషప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బాబు చేసిన విషప్రచారం వల్ల వ్యాక్సిన్‌ కోసం ప్రజలు బారులు తీరుతున్నారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అధికారులు వాస్తవాలు చెబుతున్నా అబద్ధాలు ఆపడం లేదు. వ్యాక్సిన్లు కొనడం లేదంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు పంపాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. వ్యాక్సిన్ కేటాయింపులను కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ మానిటరింగ్ చేస్తోంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం ఇదే విషయం స్పష్టం చేసింది. అబద్ధాలు ప్రచారం చేసే వారికి ఏ శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి.

కోవిడ్‌ కట్టడిపై సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ప్రజల ప్రాణాల గురించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక క్లారిటీతో ఉండాలి. మన సీఎం జగన్‌కి ఆ క్లారిటీ ఉంది. చంద్రబాబు, లోకేష్ అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా..? వేసుకుంటే ఎక్కడ వేయించుకున్నారు?. హైదరాబాద్‌లో వేయించుకున్నారా?. ఏపీలో వేయించుకున్నారా?. బయట నుంచి తెప్పించుకున్నారా?. ఒక వేళ వ్యాక్సిన్ వేయించాలంటే లోకేష్ ముందు తన తండ్రికి వేయించాలి కదా.. చివరికి ఏజ్ గ్రూపుల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాడు. ప్రపంచంలో మురికి గుంటలో శ్వాస పీల్చే నీచమైన వ్యక్తిత్వం చంద్రబాబుది. 

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ డీ లైసెన్సింగ్ చేసే  విషయంపై .. డబ్ల్యుటీవోలోనూ చర్చలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పేటెంట్‌పై కేంద్రానికి కూడా హక్కు ఉంది. భారత్ బయోటెక్ పేటెంట్‌ను డీ లైసెన్సింగ్ చేసి ఉత్పత్తి  పెంచేందుకు.. కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ లేఖ కూడా రాస్తారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యతను వదిలేసి.. జూమ్‌లో ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. రామోజీరావు బంధువు భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్, ఆక్సిజన్ కోసం అన్నివిధాల కృషి చేస్తున్నాం’’ అని అన్నారు.

చదవండి : ధైర్యం చెప్పకుండా దుష్ప్రచారమా?

మరిన్ని వార్తలు