గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేశారు: సజ్జల

30 May, 2021 10:49 IST|Sakshi

కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం.. అభివృద్ధి

పేదల బాగోగుల కోసం సీఎం జగన్‌ అహర్నిశలూ శ్రమిస్తున్నారు

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: రెండేళ్లలోనే చరిత్రలో మిగిలిపోయే సువర్ణ ఘట్టాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారని.. మొత్తంగా 90 శాతంపైగా అభివృద్ధితో రాష్ట్రం ముందుకు నడిచిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో  పార్టీ జెండాను ఆయనతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని తెలిపారు. పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి సీఎం జగన్ ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నామని.. అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించామని పేర్కొన్నారు. 20 ఏళ్లల్లో సాధించలేని అభివృద్ధిని రెండేళ్లలోనే సీఎం జగన్ చేసి చూపారన్నారు. మహా నేత వైఎస్ఆర్ అభివృద్ధి బాటలో సీఎం జగన్ నడిచారన్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమాన్ని అందించామని’’ సజ్జల పేర్కొన్నారు.

గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమైందని.. రాజ్యాంగ నిర్మాతలు కలలు గన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేశారని తెలిపారు. నిజాయతీ, నిబద్ధతతో కూడిన వ్యవస్థను సీఎం జగన్ తన పాలనలో తెచ్చారని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల సీఎం జగన్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు భరోసాతో రైతులను ప్రభుత్వం ఆదుకుంది. ఏ సంక్షేమ పథకం ఎప్పుడు అమలవుతుందో.. ఎప్పటికప్పుడు సీఎం జగన్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పు తెచ్చి నాడు-నేడు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి తెచ్చి విద్య అందిస్తున్నాం. రాష్ట్ర ప్రజలను మొత్తం తన కుటుంబంగా సీఎం జగన్ భావిస్తున్నారు. విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రభుత్వం భావిస్తోంది. అప్పుల భారం పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు సీఎం జగన్ నడిపిస్తున్నారు. రేపు 16 మెడికల్ కాలేజీలకు సీఎం జగన్ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేస్తారని’’ సజ్జల వెల్లడించారు.

ఐదేళ్లలోనే ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని సీఎం నిరంతరం శ్రమిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే .. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పూర్తికి సీఎం జగన్ అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు, పోర్టుల అభివృద్ధికి మౌలిక వసతులు సమకూర్చారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా రాష్ట్రాభివృద్ధికి సీఎం శ్రమిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు ఎక్కువగా అవకాశాలు కల్పించి.. ఆ వర్గాలు అభివృద్ధి చెందేలా సీఎం జగన్ కృషి చేశారు. చంద్రబాబు తత్వం ఎప్పటికీ మారదు.. అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా చంద్రబాబు మాట్లాడుతారు. చంద్రబాబు తనలో ఉన్న లోపాలపై  ఆత్మవిమర్శ చేసుకోవాలని’’ సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.

మరిన్ని వార్తలు