‘పనికిరాని వారంతా తొడలు కొడుతున్నారు’

3 Sep, 2021 16:56 IST|Sakshi

సాక్షి,జహీరాబాద్‌( హైదరాబాద్‌): టీఆర్‌ఎస్‌ పార్టీలో పనికి రాని వారంతా తొడలు కొడుతున్నారని, కాంగ్రెస్‌ కార్యకర్తలు వారి తొడలు వంచే సమయం రాబోతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం జహీరాబాద్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జె.గీతారెడ్డికి నిర్వహించిన సన్మాన సభలో జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నేతల తొడలు వంచాల్సిన అవసరం ఉందన్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే జహీరాబాద్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తోందన్నారు. కాంగ్రెస్‌తో లబ్ధి పొందిన వారే బయటకు వెళ్లి కాంగ్రెస్‌ను ఓడించారన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకుని కాంగ్రెస్‌ సత్తా చాటాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. బీజేపీ నేత బండి సంజయ్‌ పాద యాత్ర ఎందుకు నిర్వహిస్తున్నాడో, ఎవరి కోసం నిర్వహిస్తున్నాడో చెప్పాలన్నారు. పెట్రో, డీజిల్, గ్యాస్‌ ధరలను పెంచింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పోలీసులకు భయడాల్సిన అవసరం లేదన్నారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని, అప్పుడు వేధిస్తున్న పోలీసుల గురించి ఆలోచిద్దాం అన్నారు. ఎన్నికలు వచ్చాక మంత్రి హరీశ్‌రావు గురించి ఆలోచిద్దామన్నారు.

చదవండి: మీ ఓటు రూపాయి బొట్టు బిళ్లకా? ఆసరా పెన్షన్‌కా?

మరిన్ని వార్తలు