భూపాలపల్లి ఎమ్మెల్యేపై హెచ్చార్సిలో ఫిర్యాదు 

13 Apr, 2021 14:25 IST|Sakshi

నాంపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ బండారి కవిత, భర్త దేవేందర్‌తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి విషయమై ఎమ్మెల్యేతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్‌ చేసినట్లు తెలిపారు.  

ఈ నెల 2న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ధి గురించి పలువురు సర్పంచ్‌లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన భర్త దేవేందర్‌ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చరించినట్లు తెలిపారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్‌ను కోరారు. 

మరిన్ని వార్తలు