అది ‘క్లీన్‌ చిట్‌’ కమిటీ: జైరామ్‌

23 Mar, 2023 05:53 IST|Sakshi

న్యూఢిల్లీ:  అదానీ గ్రూప్‌ అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తేల్చిచెప్పారు. అది ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ కమిటీగా మాత్రమే తోడ్పడుతుందని అన్నారు. అదానీ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపే అధికారం చట్టపరంగా నిపుణుల కమిటీకి లేదన్నారు.

కేవలం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తోనే నిజాలు వెలుగులోకి వస్తాయని తేల్చిచెప్పారు. జైరామ్‌ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను దేశ ప్రయోజనాల కోసమా? వ్యక్తిగత అవసరాల కోసమా? దేని కోసం వాడుకుంటారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. 1992లో హర్షద్‌ మెహతా, 2001లో కేతన్‌ పరేఖ్‌ స్కామ్‌లపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదానీ అక్రమాలపై జేపీసీని నియమించాలని చెప్పారు.  

సభలో రాహుల్‌ గాంధీని మాట్లాడనివ్వండి  
లోక్‌సభలో మాట్లాడేందుకు, వివరణ ఇచ్చేందుకు రాహుల్‌కు అవకాశం కల్పించాలని స్పీకర్‌కు జైరామ్‌ రమేశ్‌ విజ్ఞప్తి చేశారు. రూల్‌ 357 కింద సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్‌కు రాహుల్‌ లేఖ రాశారని, దానిపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కాలమే సమాధానం చెబుతుందన్నారు.

మరిన్ని వార్తలు