Funds: బీజేపీకి కోట్లకు కోట్లు.. చతికిలబడ్డ కాంగ్రెస్‌

10 Jun, 2021 16:22 IST|Sakshi

జాతీయ పార్టీలకు పోటీగా టీఆర్‌ఎస్‌కు విరాళాలు

బీజేపీకి రూ.785, కాంగ్రెస్‌కు రూ.139 కోట్లు, టీఆర్‌ఎస్‌కు రూ.130 కోట్లు

ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల్లో పార్టీల వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ఓట్లు.. సీట్లపరంగా.. నాయకులపరంగా దిగజారుతున్న కాంగ్రెస్‌ ఇప్పుడు విరాళాల అంశంలోనూ కాంగ్రెస్‌ పార్టీ చతికిలపడుతోంది. విరాళాలు ఇచ్చేవారు కరువవుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ నిధుల్లేక పార్టీ కార్యక్రమాలు చేయడం కూడా కష్టమవుతోంది. అయితే బీజేపీ మాత్రం దేశంలోనే అత్యధికంగా విరాళాలు పొందుతున్నది. అత్యధిక విరాళాలు పొందుతున్న పార్టీగా కమలం పార్టీ నిలిచింది. బీజేపీకి ఏడేళ్లుగా అత్యధిక విరాళాలు అందుతున్నాయి. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో పార్టీల విరాళాలు చూస్తే ఇలా ఉన్నాయి.  2019-20 ఆర్థిక సంవత్సరంలో తమకు అందిన విరాళాల నివేదికను రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఆ లెక్కలు పరిశీలించగా రూ.785.77 కోట్లు విరాళాలు అందినట్లు  బీజేపీ తెలిపింది. వివిధ కంపెనీలు, వ్యక్తుల నుంచి ఆ వివరాలు వచ్చాయని పేర్కొంది. ఇ​క కాంగ్రెస్‌ పార్టీకి రూ.139 కోట్లు విరాళాలుగా అందాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి ఐదు రెట్లు అధికంగా విరాళాలు వచ్చాయి. 

బీజేపీ ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌కు చెందిన జూపిటర్‌ క్యాపిటల్‌తో పాటు ఐటీసీ గ్రూప్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌ తదితర బడా బడా కార్పొరేట్‌ సంస్థలతో కూడిన ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు నుంచి ఏకంగా రూ.271 కోట్లు బీజేపీకి అందాయి. జేఎస్‌డబ్యూ గ్రుపు సంస్థలకు సంబంధించి జనకల్యాణ్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు రూ.45.95 కోట్లు బీజేపీకి విరాళంగా నిధులు వచ్చాయి. వీటితో పాటు హిందల్కోకు చెందిన సమాజ్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు రూ.3.75 కోట్లు, ఏబీ జనరల్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు రూ.9 కోట్లు కాషాయ పార్టీకి విరాళంగా అందించాయి. ఇలా బడా బడా వ్యాపార, వాణిజ్య సంస్థలకు కమలం పార్టీకి విరాళాలు వెల్లువగా ఇచ్చాయి.

కాంగ్రెస్‌ పార్టీ రూ.139.01 కోట్లు విరాళంగా అందుకుంది. ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా రూ.58 కోట్లు విరాళాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌కు తక్కువ నిధులే వచ్చాయి. మిగతా పార్టీలు సీపీఐ (ఎం)కు రూ.19.69 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.8.08 కోట్లు, సీపీఐకి రూ.1.29 కోట్లు, ఎన్సీపీకి రూ.59.94 కోట్లు వచ్చాయని. ఈ మేరకు ఆయా పార్టీలు తమ నివేదికలో ఎన్నికల సంఘానికి తెలిపాయి. తమకు నిధులు ఏమీ అందలేని బీఎస్పీ పెదవి విరిచింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు అధికార పార్టీలు విరాళాల్లో ముందున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు అత్యధికంగా రూ.130.46 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రూ.92.7 కోట్లు విరాళాలు వచ్చాయి. మహారాష్ట్రలో శివసేనకు రూ.111.4 కోట్లు, ఒడిశాలో బీజేడీకి రూ.90.35 కోట్లు, తమిళనాడు ఏఐఏడీఎంకేకు రూ.89.6 కోట్లు, డీఎంకేకు రూ.64.90 కోట్లు విరాళాలు అందినట్లు ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదించాయి.

విరాళాలు ఇలా.. (రూ.కోట్లలో)

బీజేపీ రూ.785.77
కాంగ్రెస్‌ పార్టీ రూ.139.01
టీఆర్‌ఎస్‌ రూ.130.46
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.92.7
శివసేన రూ.111.4
ఏఐఏడీఎంకే రూ.89.6
డీఎంకే రూ.64.90
సీపీఐ (ఎం) రూ.19.69
సీపీఐ రూ.1.29
తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ.8.08
ఎన్సీపీ రూ.59.94

మరిన్ని వార్తలు