ప్రతిపక్షమే లేకుండా చేయాలని కుట్ర.. బీజేపీ డర్టీ ట్రిక్స్‌కు చెక్ పెడతాం..

14 Sep, 2022 16:37 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఓ వైపు భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం  తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే.. మరోవైపు గోవాలో ఆ పార్టీ ఎ‍మ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. 11 మందిలో 8 మంది బుధవారం బీజేపీలో చేరారు. దీంతో హస్తం పార్టీ సీనియర్‌ నేతలు కమలం పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్యను ఆపరేషన్ కీచఢ్‌(బురద)గా అభివర్ణించారు. డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

'భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం చూసి బీజేపీ ఆపరేషన్ కీచఢ్‌(బురద)ను వేగవంతం చేసింది. యాత్రకు లభిస్తున్న స్పందన చూసి కమలం పార్టీ నిరాశ చెందుతోంది. యాత్రను తక్కువ చేసి చూపేందుకు రోజూ ప్రజల దృష్టి మళ్లించే పనులు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. మేం నిరాడంబరంగానే ఉంటాం. బీజేపీ డర్టీ ట్రిక్స్‌ను అధిగమిస్తాం' అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

మరో సీనియర్ నేత, ఏఐసీసీ గోవా ఇంఛార్జ్ దినేశ్ గుండూరావు బీజేపీ చర్య ప్రజాస్వామ్య విలువలను నిర్వీర్వం చేసేలా ఉందని మండిపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ధనం, పదవి ఆశలుజూపి ప్రతిపక్షమే లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. ఇది డబ్బు, అధికార మదంతో కూడిన సిగ్గుచేటు చర్య అని తీవ్ర విమర్శలు చేశారు.

అలాగే బీజేపీలోకి వెళ్లి దింగబర్ కామత్, మైకేల్ లోబోలు నమ్మక ద్రోహం చేశారని, పాతాళానికి దిగజారారని గుండూరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్‌లోనే ఉంటాం, బీజేపీలో చేరం' అని దైవ సాక్షిగా, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఇప్పుడు పార్టీ మారడం దురదృష్టకరమన్నారు.

చదవండి: పంజాబ్‌లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్‌

మరిన్ని వార్తలు