చండీగఢ్: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ అత్యవసర సమావేశం అనంతరం పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించడంతోపాటుగా, జమ్మూకశ్మీర్లో పంజాబీని రెండో అధికారి భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రైతుల ఆకాంక్షలను గౌరవించడంలో కేంద్రం విఫలమైనందునే..బీజేపీతో తమ పార్టీ చిరకాల మైత్రికి ఫుల్స్టాప్ పెట్టాల్సివచ్చిందన్నారు.