మనకంటే సిక్కింలోనే ఎక్కువ అభివృద్ధి: అర్వింద్‌ 

29 Sep, 2021 08:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కంటే కూడా సిక్కిం ఎక్కువ అభివృద్ధిని సాధించిందని బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందంటూ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము సాధిస్తున్న పురోగతితో దేశాన్ని నడుపుతున్నామని, ఎన్నో అంశాల్లో ఆదర్శంగా నిలుస్తామని చెబుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు.. ఆదాయం కోసం ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం అర్వింద్‌ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీవెళ్లిన సీఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వంలోని ముఖ్యశాఖల మంత్రులు, తమ పార్టీ పెద్దలను కలిసి వచ్చినా.. టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ కుటుంబ పాలనను బీజేపీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు బాగా ఉంటే పదేపదే కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 
చదవండి: ‘కోదండరాం బట్టలు చినిగిపోయేలా దాడి చేయడం దారుణం’

కోల్‌కతా కోర్టు తీర్పుతోనైనా స్పీకర్‌ కళ్లు తెరవాలి: దాసోజు 
సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులపై కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్‌ వ్యవస్థకే చెంపపెట్టని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రావణ్‌ పేర్కొన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరచి ఫిరాయింపు నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చెప్పారు. ఈ మేరకు మంగళవారం శ్రావణ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్‌రాయ్‌ అనర్హత పిటిషన్‌పై అక్టోబర్‌ 7లోగా నిర్ణయం తీసుకోవాలని పశి్చమబెంగాల్‌ స్పీకర్‌కు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఆయన వివరించారు. ఆ తీర్పును గౌరవించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు