రాహుల్‌ టీ షర్ట్‌ అంత ఖరీదా.. మోదీ సూట్‌ ఏమైనా తక్కువా?: సోషల్‌ మీడియా వార్‌!

9 Sep, 2022 18:13 IST|Sakshi

దేశంలో పొలిటికల్‌గా మునుపటి పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే భారత్‌ జోడో యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. కాగా, యాత్ర సందర్భంగా రాహుల్‌ ధరించిన టీ షర్టును బీజేపీ ఫోకస్‌ చేసిన దాని ధర ప్రస్తావించింది. దీంతో​, కాంగ్రెస్‌.. ప్రధాని మోదీ ధరించే సూట్‌ను టార్గెట్‌ చేసి ధరను చెప్పడం పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. 

అయితే, కాంగ్రెస్‌ తలపెట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ ధర విషయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల వార్‌ నడుస్తోంది.  పాదయాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీ షర్ట్ ధరించారు. కాగా, ఆ టీ షర్ట్‌ బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందినది అని.. టీ షర్ట్ ధర రూ.41,000 అంటూ బీజేపీ ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది. ఈ సందర్భంగా రాహుల్‌ ఫొటోకు ‘భారత్ దేఖో’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. 

దీంతో, బీజేపీకి కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూటు ధరను తెర మీదకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌ వేదికగా.. భారత్ జోడో యాత్ర సందర్భంగా వస్తున్న ప్రజా స్పందనను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారా? అంటూ కౌంటర్‌ ఇచ్చింది. డ్రెస్సుల గురించి కాదు.. దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి అంటూ వ్యాఖ్యలు చేసింది. 

ఈ క్రమంలోనే మనం బట్టల గురించే మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధాని మోదీ సూట్ల గురించి మాట్లాడాలి. మోదీ ధరించిన రూ.10 లక్షల సూటు, రూ.1.5 లక్షల కళ్లద్దాల గురించి కూడా మాట్లాడుకుందామా అంటూ రివర్స్‌ దాడికి దిగింది. దీంతో, అధికార బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్స్‌ వార్‌ నడుస్తోంది.

మరిన్ని వార్తలు