తిరుపతిలో కార్ల ర్యాలీలో నినాదాలు
అధికార పార్టీ నేతలపై యువత తిరగబడాలన్న అచ్చెన్న
తిరుపతి అర్బన్: అచ్చెన్నాయుడు సీఎం కావాలి అంటూ కొందరు యువకులు నినాదాలు చేసిన ఘటన తిరుపతిలో జరిగింది. ఆదివారం తిరుపతిలోని బాలాజీ కాలనీ జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి తెలుగు యువత నేతృత్వంలో యువ చైతన్య యాత్ర ప్రారంభించారు. పూలే సర్కిల్ నుంచి టౌన్క్లబ్ ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ర్యాలీలో స్థానికులే కాకుండా విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. వారిలో కొందరు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు.
వెంటనే అక్కడున్న మిగతావారు జోక్యం చేసుకుని నినాదాలు చేస్తున్న వారిని వారించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. యువత తిరగబడాలి.. అధికారపార్టీ నేతలను నిలదీయాలంటూ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పథకం సక్రమంగా అమలు కావడంలేదని, అంతా తిరగబడాలని కార్యకర్తలను రెచ్చగొట్టారు. యువతకు ఉద్యోగాలు లేవని, ఉపాధి లేదని ఆరోపించారు. అనంతరం పూలే విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు కార్ల ర్యాలీ సాగింది. ఈ నేపథ్యంలో టౌన్క్లబ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కల్గింది. ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.