‘పోలవరం’ పూర్తికి కేంద్రం కట్టుబడి ఉంది

27 Oct, 2020 03:20 IST|Sakshi

కొందరు కావాలని ప్రజల్ని గందరగోళంలోకి నెడుతున్నారు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మేం తీర్మానం చేశాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయించి పూర్తి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు తగ్గిస్తోందంటూ ఈ మధ్య ఏవేవో కథనాలు పేపర్లలో వస్తున్నాయని.. ఎందుకో కొందరు అయోమయానికి గురై ప్రజల్ని ఇలా గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం కేవలం నిర్మాణ ఏజెన్సీ మాత్రమేనని.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉందని తెలిపారు. అమరావతి విషయంలో బీజేపీని వేలెత్తి చూపే ప్రయత్నం జరుగుతోందని.. అసలు ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

రాజధాని కోసం కేంద్రం నిధులు ఇవ్వడంతో పాటు హడ్కో నుంచి కూడా రుణం ఇప్పించిందన్నారు. అప్పట్లో వచ్చిన రూ.7,200 కోట్ల నిధులను చంద్రబాబు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు భూములిచ్చిన రైతులకు 64 వేల ప్లాట్లను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తమ పార్టీ తీర్మానం చేసినట్లు వివరించారు. అమరావతి ప్రాంతంలో ఓ పెద్ద హాస్పిటల్‌ నిర్మించేందుకు లండన్‌ సంస్థ వాళ్లు ముందుకు వస్తే.. గత ప్రభుత్వ పెద్దలు ఏదో చేసి ఇక్కడ్నుంచి ఆ సంస్థ వెళ్లిపోయే పరిస్థితి కల్పించారని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఆ లండన్‌ సంస్థ అమరావతిలో హాస్పిటల్‌ నిర్మాణానికి ముందుకొచ్చిందని వివరించారు. ఇక విజయవాడలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను కేంద్రం వెంటనే మంజూరు చేస్తే.. దానిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓ 420 కాంట్రాక్టర్‌కు అప్పగించి కాలయాపన చేసిందని ఆరోపించారు.    

మరిన్ని వార్తలు