ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
మదనపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమని భావించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పరంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నీ ప్యాకేజీ రూపంలో చంద్రబాబు అప్పట్లో స్వీకరించారని చెప్పారు.
చంద్రబాబు హయాంలో జాతీయ షెడ్యూల్డు కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్((ఎన్ఎస్ఎఫ్డీసీ) నిధులతో కొనుగోలు చేసిన థ్యాంక్యూ సీఎం వాహనాల్లో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందన్నారు. ఆ వాహనాలకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూరిస్తే చంద్రబాబు స్టిక్కర్ వేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికపై తమ పార్టీ, జనసేన ఇంకా మాట్లాడుకుంటున్నాయని, తమలో ఎవరో ఒకరి అభ్యర్థి రంగంలో ఉంటారని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.