పూటకో మాట వల్లే టీడీపీకి 23 సీట్లు

19 Nov, 2020 03:44 IST|Sakshi

చీపురుపల్లి: పూటకో మాట, రోజుకో మాట.. చెప్పినందువల్లే టీడీపీకి 23 సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం రాత్రి విజయనగరం జిల్లా చీపురుపల్లి వచ్చిన ఆయన ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు నివాసంలోమాట్లాడుతూ ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబు పిల్లి మొగ్గలు వేశారన్నారు. 

► పోలవరం విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన డిజైన్‌ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. పోలవరం ఎత్తు తగ్గిపోతుందంటూ చంద్రబాబు, ఆయన అనుచరులు చర్చకు తెరలేపి మభ్యపెడుతున్నారు. కానీ, ప్రాజెక్టు ఎత్తు తగ్గదు.
► పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కచ్చితంగా నిధులిచ్చి, నిర్మాణం జరిపించి తీరుతుంది. దీంతోపాటు  జాతీయ రహదారులు, తాగునీరు వంటి ఎన్నో జాతీయ ప్రాజెక్టులను కేంద్రం పూర్తి చేస్తుంది. రాష్ట్రానికి ఐదేళ్లకు సంబంధించి కేంద్రం రూ.45 వేల కోట్లు ఇస్తోంది. ఆ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.  

>
మరిన్ని వార్తలు